Saturday, September 28, 2019

అఫ్గానిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో 'బయోమెట్రిక్' విధానంలో ఓటింగ్... ఆ ఇద్దరే ప్రధాన పోటీదారులు

  తాలిబన్ల హెచ్చరికలు, పెద్దయెత్తున భద్రతా ఏర్పాట్ల మధ్య అఫ్గానిస్తాన్‌లో శనివారం అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్‌లో మోసాలను నివారించే ప్రయత్నంలో భాగంగా వేలిముద్రల ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నారు. పోలింగ్ మొదలైన కాసేపటికే కాందహార్ నగరంలోని ఒక పోలింగ్ కేంద్రం సమీపాన పేలుడు సంభవించింది. 16 మంది గాయపడ్డారు. పోలింగ్ కేంద్రాలపై దాడులు జరుపుతామని తాలిబన్లు ఇంతకుముందు హెచ్చరించారు. తాజా ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా అబ్దుల్లా. 2014 నుంచి ఒకే ప్రభుత్వంలో వీరిద్దరూ అధికారాన్ని పంచుకొంటున్నారు. ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి జబీ సాదత్ వార్తాసంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ- ఓటు వేసేందుకు జనం బారులు తీరారని చెప్పారు. ఓటర్లు పెద్దసంఖ్యలో రావడంపై సంతోషం వ్యక్తంచేశారు.  అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు 18 మంది వివరాలు నమోదు చేయించుకున్నారు. తర్వాత వీరిలో ఐదుగురు వెనకడుగు వేశారు. అధ్యక్ష పదవికి మహిళలు ఎవరూ పోటీపడటం లేదు. 2014లో అధ్యక్ష పీఠమెక్కేందుకు నెలలపాటు పోరాడిన ఇద్దరు ముఖ్య నాయకులే ఈ ఎన్నికల్లోనూ ప్రధాన పోటీదారులుగా తలపడుతున్నారు. అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరిద్దరిపైనా ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా యుద్ధంతో అఫ్గానిస్తాన్‌లో ఎంతో విధ్వంసం జరుగుతోంది. యుద్ధం వల్ల ఏటా వేల మంది చనిపోతున్నారు. వివిధ దేశాల సైనిక బలగాలు అఫ్గాన్ యుద్ధ క్షేత్రంలో పోరాడుతున్నాయి. అఫ్గానిస్తాన్ యుద్ధంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకొంది. సంక్షోభం ముగిసిపోయేలా తాలిబన్లతో చర్చలు జరిపేందుకు అమెరికా ప్రయత్నిస్తూ వస్తోంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనికులు సుమారు 14 వేల మంది ఉన్నారు. బ్రిటన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాల సైనికులూ వేలల్లో ఉన్నారు. అఫ్గాన్ భద్రతా బలగాలకు శిక్షణ, సలహాలు, సహాయం అందించడానికి నాటో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రాధాన్యం ఏమిటి? 2001లో తాలిబన్లను అమెరికా నాయకత్వంలోని సైనిక బలగాలు గద్దె దించిన తర్వాత జరుగుతున్న నాలుగో ఎన్నిక ఇది. అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు కీలక దశలో ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అఫ్గాన్ గమనంలో ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుంది. ఈ నెల్లో తాలిబన్లు, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. అఫ్గాన్ ప్రభుత్వానికి చట్టబద్ధత లేదంటూ, ఈ సర్కారుతో నేరుగా చర్చలు జరిపేందుకు తాలిబన్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడం లేదు. అమెరికాతో ఒప్పందం కుదిరాకే అఫ్గానిస్తాన్‌ అధికార యంత్రాంగంతో చర్చలు జరపుతామని తాలిబన్లు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, అఫ్గాన్‌లో ఎవరు అధికార పీఠమెక్కుతారనేది అమెరికాకు అత్యంత ప్రధానమైన అంశం కాకపోవచ్చు. సైన్యం, తాలిబన్లు, ఇతర ఇన్‌సర్జెంట్ల మధ్య పోరుతో సతమతమవుతున్న సాధారణ ప్రజానీకానికి మాత్రం ఇది ముఖ్యమైనది. రెండు దశల్లో ఎన్నిక రెండు దశలతో కూడిన ప్రత్యక్ష ఓటింగ్ విధానం ప్రకారం అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. తొలి దశలో ఏ అభ్యర్థికీ 50 శాతానికన్నా ఎక్కువ ఓట్లు రాకపోతే, మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు రెండో దశలో ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలు మూడు వారాల తర్వాత వెలువడతాయి. రెండో దశ ఎన్నిక అవసరమయ్యే పక్షంలో దానిని నవంబరులో జరుపుతారు. దాదాపు ఐదు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. భద్రతా కారణాలతో మరికొన్ని వందల కేంద్రాలను తెరవొద్దని నిర్ణయించారు.  బీబీసీ పరిశోధన ప్రకారం- అఫ్గానిస్తాన్‌ హింస వల్ల ఆగస్టులో రోజుకు సగటున మగవారు, ఆడవారు, చిన్నపిల్లలు అంతా కలిపి 74 మంది చనిపోయారు. వీరిలో ఐదో వంతు మంది పౌరులే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం- 2019 ప్రథమార్ధంలో ఇన్‌సర్జెంట్ల చేతిలో కంటే అఫ్గాన్, అమెరికా బలగాల చేతిలోనే ఎక్కువ మంది పౌరులు చనిపోయారు. శాంతి, శాంతి స్థాపన అంశంలో ఎవరి సామర్థ్యం ఎంతనేది అత్యధిక ఓటర్లకు అధిక ప్రాధాన్యమున్న అంశం. Iకాబూల్‌లో భద్రతా ఏర్పాట్లు గత ఎన్నికలపై ఆరోపణలు ఐదేళ్ల క్రితం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో మోసం, రిగ్గింగ్ జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడటానికి కొన్ని నెలలు పట్టింది. ఇద్దరు ప్రధాన పోటీదారులతో అమెరికా చర్చలు జరిపి, ఉభయుల మధ్య ఒప్పందాన్ని కుదిర్చింది. అందుకు అనుగుణంగా 'నేషనల్ యూనిటీ గవర్నమెంట్' ఏర్పడింది. అష్రఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దుల్లా మధ్య అధికార పంపిణీపై ఒప్పందం కుదిరింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో పెద్దగా లేదు. అఫ్గానిస్తాన్ జనాభా సుమారు 3.7 కోట్లు. వీరిలో కోటి కంటే తక్కువ మందే ఓటు వేయడానికి వివరాలు నమోదు చేయించుకున్నారు. ఓటింగ్‌లో పాల్గొనేవారు అంతకన్నా తక్కువ మందే ఉండొచ్చు. 'ట్రాన్స్‌పరెంట్ ఎలక్షన్ ఫౌండేషన్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌' నిర్వహించిన ఓ సర్వే- సగం మందికి పైగా ఓటింగ్‌లో పాల్గొనాలనుకోవట్లేదని అంచనా వేసింది. పోలింగ్ బూత్‌లపై దాడులు జరుపుతామన్న తాలిబన్ల హెచ్చరికలు ఓటర్ల వెనకడుగుకు ఒక కారణం. ఇటీవల తాలిబన్లు ఎన్నికల ర్యాలీలను లక్ష్యంగా చేసుకున్నారు. పలు పెద్ద పెద్ద ప్రాంతాలు ఇప్పటికీ దాదాపు పూర్తిగా తాలిబన్ల నియంత్రణలో ఉన్నాయి. అక్కడ పౌర ప్రభుత్వం అధికారాన్ని వినియోగించే పరిస్థితులు లేవు. అందువల్ల అక్కడ ఓటింగ్ అసాధ్యం. మార్పు రాకపోవచ్చనే భావన కూడా ఓటర్ల నిరుత్సాహానికి కారణమనే అభిప్రాయం ఉంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్తాన్‌లో 55 శాతం జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. నిరుద్యోగిత 25 శాతంగా ఉంది.

No comments:

Post a Comment